నిర్గమకాండము 5:1-21

నిర్గమకాండము 5:1-21 TELUBSI

తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా–అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో–నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను. అప్పుడు వారు–హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైనయెడల మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకుబలి అర్పించుదుము; లేనియెడల ఆయన మామీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు–మోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో–ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను –ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారిమీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక–మేము వెళ్లి మా దేవునికిబలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు. ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను. కాబట్టి ప్రజల కార్య నియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచి–నేను మీకు గడ్డి ఇయ్యను; మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించు కొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తుదేశమందంతటను చెదిరి పోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారిమీద ఉంచిన నాయకులను కొట్టి–ఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా ఇశ్రాయేలీయుల నాయకులు ఫరోయొద్దకు వచ్చి–తమ దాసుల యెడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి. అందుకతడు– మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత–మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు. మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్య బడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను. –మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి. వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసి కొని –యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా

నిర్గమకాండము 5:1-21 కోసం వీడియో