దానియేలు 6:1-21

దానియేలు 6:1-21 TELUBSI

తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్పకుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజు ఉద్దే శించెను. అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయి నను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకా మనుష్యులు–అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి–రాజగు దర్యా వేషూ, చిరంజీవివై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, యీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి నను సరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేముతట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను. ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమునుబట్టి–రాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజు – మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను. అందుకు వారు–చెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యు డస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి–రాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజు–నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియు దానియేలునుగూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమో యని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను. తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి–జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను. అందుకు దానియేలు–రాజు చిరకాలము జీవించునుగాక.