అపొస్తలుల కార్యములు 19:21-41

అపొస్తలుల కార్యములు 19:21-41 TELUBSI

ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి–నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను. ఏలాగనగా – దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి–అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు. మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచు చున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారై–ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి; పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసి దోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు. మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహి తులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి–నీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు–ఎఫెసీయుల అర్తెమి దేవి మహాదేవి అని కేకలువేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి–ఎఫెసీయులారా, ఎఫె సీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము. మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒక రితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడీలాగు చెప్పి సభను ముగించెను.

అపొస్తలుల కార్యములు 19:21-41 కోసం వీడియో