అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి–మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు–ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు–యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు. తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను; అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైలెనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను. అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు–పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పెట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా ఆ దయ్యముపెట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘన పరచబడెను. విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
చదువండి అపొస్తలుల కార్యములు 19
వినండి అపొస్తలుల కార్యములు 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 19:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్లైన్లో చదవండి, బోధన క్లిప్లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు